- పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి : ఏ కేసులో అదుపులోకి తీసుకున్నదీ, నేరాభియోగం ఏమిటో కూడా తెలియజేయకుండా 60 ఏళ్ల వద్దుడ్ని నిర్భంధించడాన్ని, తిరుపతి నుంచి విజయవాడకు తీసుకురావడంపై పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరుకావాలని ఆ వద్ధుడిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఎదుట హాజరయ్యే ముందు ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ఎదుట, దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకానవసరం లేదని ఆ వద్ధుడికి స్పష్టం చేసింది. అలాగే, తిరుపతిలోని ఇంటి నుంచి వృద్ధుడ్ని తీసుకువెళుతున్న ఫొటోలోని పోలీసులను గుర్తించి ఆ వివరాలు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కె. మన్మథరావు ధర్మాసనం గురువారం ప్రకటించింది.
ఈ కేసు వివరాల ప్రకారం రిటైర్డు పోలీస్ అధికారి టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డి (60)ని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాతి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, అతని ఆచూకీ తెలియడం లేదంటూ వైసీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరుపున సీనియర్ లాయర్ ఎస్.శ్రీరామ్ వాదిస్తూ మఫ్టీలో వచ్చిన పోలీసులు రెడ్డిని అన్యాయంగా రహస్య ప్రదేశంలో నిర్బంధించారని చెప్పారు. విజయవాడలోని సిట్ ఆఫీసుకు తెచ్చారని చెప్పారు. దీనిపై గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ విష్ణు తేజ ప్రతివాదన చేస్తూ, పోలీసులు రెడ్డిని నిర్బంధించలేదన్నారు. ఒక కేసులో సాక్షిగా ఈ నెల 17న తమ ముందు హాజరు కావాలని ఈ నెల 14న సిట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారన్నారు. సిట్ ఆఫీసులో ఆయన వాంగ్మూలం నమోదు చేస్తున్నారని తెలిపారు. అనంతరం హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.