కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు

సేవలన్నీ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారానే..
ఆర్‌టిజిఎస్‌పై సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని, ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఆన్‌లైన్లో అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ కార్యకలాపాలపై వెలగపూడి సచివాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారానే ప్రజలు ప్రభుత్వం నుండి అన్ని సేవలూ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఎటువంటి అవరోధాలు లేకుండా ఆన్‌లైన్‌ సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డేటాలేక్‌ పనులు వేగవంతం చేయాలని, డ్రోన్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దీనిపై ప్రభుత్వశాఖలతో వర్కుషాప్‌ పెట్టి అధికారులు కూడా దీనిపై అవగాహన పొందేలా చూడాలన్నారు. దోమల నివారణ, పురపాలక, ప్రజారోగ్యశాఖల్లో డ్రోన్‌లను ఎక్కువగా వినియోగించాలని తెలిపారు. వర్కుఫ్రం హోమ్‌ కార్యకలాపాలనూ వేగవంతం చేయాలన్నారు. దీన్ని నిరంతరం ప్రమోట్‌ చేస్తూ ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమనేదానిపై సమగ్ర కసరత్తు చేయాలని, దీనికోసం కన్సల్టెన్సీని నియమించుకోవాలని సూచించారు. మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని తెలిపారు. ఆర్‌టిజిఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ.. డేటా లేక్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని, వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 273 రకాల సేవలు అందిస్తున్నామని చెప్పారు. అవేర్‌ హబ్‌ ద్వారా వాతావరణ పరిస్థితులు, పిడుగులపై గంటముందే ప్రజలను అప్రమత్తం చేసేలా చూస్తామని తెలిపారు. పౌరులు ఫోన్‌ ఎత్తగానే ఎఐ అథారిటీ ఐవిఆర్‌ఎస్‌ హెచ్చరిక వారికి వెళుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, సిఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, పిఎస్‌ ప్రద్యుమ్న, సమాచారశాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రవెన్యూశాఖ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌టిజిఎస్‌ సిఇఒ ప్రఖార్‌జైన్‌, డిప్యూటీ సిఇఒ ఎం మాధురి పాల్గొన్నారు.

➡️