డప్పుకళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : వి. శ్రీనివాసరావు

Mar 18,2025 15:54 #Dappu Artists, #V.Srinivas rao

అమరావతి :  డప్పు కళాకారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాచౌక్‌లో ధర్నా అనంతరం మధ్యాహ్నా భోజనానికి ప్రశాంతంగా గ్రూపుగా వెళ్తున్న వారిని అక్రమంగా, అకారణంగా పోలీసులు దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఈ మేరకు  ఆంధ్రప్రదేశ్ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.  అరెస్టైన వారిలో కెవిపిఎస్‌, డప్పు కళాకారుల నాయకులు అండ్ర మాల్యాద్రి, జి.క్రాంతికుమార్‌, అనంతపురం జిల్లా అధ్యక్షుడు జింకల వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.
సర్వే పేరుతో తొలగింపు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్‌ ఇవ్వాలని, పెన్షన్‌ 7000 రూపాయలకు పెంచి వయస్సు 45 సంవత్సరాలకు తగ్గించాలని, డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని, ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని న్యాయమైన డిమాండ్లతో గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. వారి కోర్కెలు తీర్చకపోగా ధర్నాకు అనుమతి ఉన్నప్పటికీ ప్రశాంతంగా భోజనానికి వెళ్తున్న వారిని అరెస్టు చేయడం గర్హనీయం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. డప్పుకళాకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వి. శ్రీనివాసరావు కోరారు.

➡️