1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

  • సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుధవారం లేఖ రాశారు. ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటనను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ లేఖలో వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. 27వ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని, దీనిని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని తెలిపారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి కూడా దక్కకుండా పోతుందని, 1/70 చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరించారు. భూమిపై గిరిజనుల హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
పంప్డ్‌ స్టోరేజీ, హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలను అన్యాక్రాంతం అవుతున్నాయని, ఆదివాసీలు దీన్ని ప్రతిఘటిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ని సవరిస్తే మరింత వెనుకబడిపోతాయని, తక్షణం ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి గిరిజన వ్యతిరేక ప్రకటనలు చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను అదుపుచేయాలని ముఖ్యమంత్రిని వి. శ్రీనివాసరావు కోరారు.

➡️