- చివరి 43 మీటర్ల ప్రాంతంలో పనుల నిలిపివేత
- డేంజర్ జోన్గా ప్రకటించిన రెస్క్యూ టీం
- బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఎస్ఎల్బిసి సొరంగంలో కార్మికుల ఆచూకీ ఇప్పట్లో తెలిసేలా లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పిన దాన్నిబట్టి వారి మృతదేహాల వెలికితీత ప్రయత్నాలకు ఫుల్స్టాప్ పెట్టినట్టు అర్థమవుతోంది. టన్నెల్లో కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం అత్యంత ప్రమాదకరమని తెలిసినా.. వారి ఆచూకీ కోసం ప్రాణాలకు తెగించి రెస్క్యూ టీం 24 గంటలు రెండు నెలలు కృషి చేసింది. మైనింగ్, ఆర్మీ, హైడ్రాతోపాటు 12 శాఖలకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ప్రాంతంలో రోబోలను ఉపయోగించారు. కేరళ కడావర్ డాగ్స్ను రప్పించారు. చిన్న యంత్రాలతో పనులు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు నెలల కాలంలో ఇద్దరు ఇంజనీయర్ల మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. ఇంకా ఆరుగురికి ఆచూకీ తెలియలేదు. సహాయక పనులు ముందుకు సాగడం లేదు. ఉబికి వస్తున్న నీరు, మట్టి తీవ్రతతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది. చివరకు టిబిఎంకు ముందు భాగాన ఉన్న 43 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అక్కడ పనిచేసే వారు రిస్క్లో పడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. దాంతో చివరి ప్రాంతంలో ఇప్పట్లో పనులు చేయడానికి వీలు కాదని ఇనుప కంచె వేశారు.
మృతదేహాలు బయటపడిన ఇద్దరు ఇంజనీర్ల కుటుంబాలతోపాటు మిగతా ఆరు కుటుంబాలకు కూడా ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున అందజేసింది. కార్మికుల కుటుంబాలు తమ బిడ్డల ఆచూకీ చూపాలని అడుగుతుంటే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చేతిలో పెట్టింది. అంటే ఇక ఎస్ఎల్బిసిలో ఇరుక్కున కార్మికుల కథ ముగిసిట్లేనని తెలుస్తోంది. హై టెక్నాలజీని ఉపయోగించి కార్మికులను బయటకు తెస్తామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నా.. ఇప్పట్లో అది జరిగే పనికాదని తెలుస్తోంది. సొరంగం చివరి 43 మీటర్ల ప్రాంతంలో పనులను నిషేధించారు. అక్కడ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పై నుంచి వస్తున్న నీరు, మట్టి కూలి ప్రమాదకరంగా మారింది. అందుకే ఇక హైటెక్నాలజీని వాడతామని మంత్రి చెప్పారు. కానీ ఎప్పటిలోగా తిరిగి పనులు పునరుద్ధరణ చేస్తారో చెప్పడం లేదు. ఎస్ఎల్బీసీ దోమలపెంట దగ్గర పనులు ఇలా ఉంటే.. మన్నెవారిపల్లిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ టీబీఎం మిషన్ చెడిపోయింది. దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఇక్కడి నుంచి కూడా పనులు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.