ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైసిపి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల కమిషనరు నీలం సహానిని కలిసి వైసిపి నేతలు వినతిపత్రం అందజేశారు. ఆమెను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టిఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ మేయరు రాయన భాగ్యలక్ష్మి ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో ఎన్నికలను ఏకపక్షంగా, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తాము ఎన్నికల కమిషన్ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.
