హైదరాబాద్: తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఫార్ములా ఈ-రేస్ కేసు నిర్వహించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై తమకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉందన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బామ్మర్డులకు, కొడుకుకు కాంట్రాక్టులు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేని కొనడానికి వెళ్లిన దొంగను కాదు అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించారు. తాను అవినీతి చేయలేదని, కొంతమంది కాంగ్రెస్ నేతలు తనపై బురద చల్లి పబ్బం గడుపుకొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతూనే ఉంటామని… కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంకో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, తమను పక్కదోవ పట్టించలేరని పేర్కొన్నారు.