కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశం
సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న కొండపై చందనోత్సవం సందర్భంగా జరిగిన విషాద ఘటనకు బాధ్యులను చేస్తూ ఏడుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లులో పెట్టింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యకు ఆదేశించింది. గత నెల 30న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడడం, ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ను నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సింహాచలంలో ఈ కమిషన్ విచారణ జరిపింది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సహా వివిధ సాక్షుల నుంచి పలు స్టేట్మెంట్లను రికార్డు చేసింది. నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సోమవారం అందజేసింది. గోడ పటిష్టత, భక్తుల భద్రతను దేవస్థానం అధికారులు గాలికొదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్థారించింది. చంద్రబాబును కమిషన్ చైర్మన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కలసి సింహాచలం ప్రమాద పరిస్థితులను వివరించారు. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది లేదని ప్రాథమికంగా తేలిందన్నారు. భారీ వర్షం రావడంతో పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడకు దిగువన గండి కొట్టేసి గోడ కూలిపోయినట్లు వెల్లడించారు. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావుడిగా నిర్మించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ప్రసాద్ స్కీంలో భాగంగా గోడ నిర్మాణానికి హడావుడిగా అనుమతులు ఇచ్చారని నివేదికలో పొందుపర్చారు. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లూ, పునాది లేకపోవడంతో ఇంత విపత్తు చోటుచేసుకున్నట్లు వివరించినట్లు తెలిసింది. ఈ ఘటన విషయంలో ఆలయ ఇఒను ప్రధాన కారకునిగా నివేదికలో పొందుపరిచారు. సింహాచలం దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, టూరిజం కార్పొరేషన్ అధికారులను,, కాంట్రాక్టర్ లక్ష్మణరావును బాధ్యులుగా నివేదికలో పేర్కొంటూ వీరందరిపైనా తీవ్ర చర్యలకు త్రిసభ్య కమిషన్ సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సింహాచలం దేవస్థానం ఇఒ కె సుబ్బారావు, ఇఇ డిజి.శ్రీనివాసరాజు, డిప్యూటీ ఇఇ కెఎస్ఎన్ మూర్తి, జెఇ కె.బాబ్జీ, ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిటిడిసి) ఇఇ కె.రమణ, డిప్యూటీ ఇఇ ఎవివిఎల్ఆర్.స్వామి, ఎఇ పి మదన్మోహన్,లపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ కె.లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు ఆయనపైనా, సింహాచలం దేవస్థానం ఇఒ కె.సుబ్బారావు, ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిటిడిసి) ఇఇ కె.రమణపైనా క్రమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
