ఘోర ప్రమాదం – ముగ్గురు మృతి

Apr 15,2025 10:48 #Fatal accident, #three dead

ఒంటిమిట్ట (కడప) : వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు … తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో (ఏపీ31 సిడబ్ల్యు 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప – చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొట్టింది. స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్‌ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు (19), ధర్మారెడ్డి (26), వినోద్‌ (25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునిల్‌నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్‌ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్‌ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మఅతుడు ధర్మారెడ్డితో మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడినవారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్‌టీసీ ఆర్‌ఎం పి.గోపాల్‌రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్‌ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్‌ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️