ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని నడింపల్లి వద్ద కడప -చెన్నై ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ధర్మారెడ్డి (30), వినోద్‌ (35) మరో వ్యక్తి కలిసి స్కార్పియోలో తిరుపతి నుంచి నంద్యాలకు పయనమయ్యారు. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి ఎలక్ట్రికల్‌ బస్సును వేగంగా ఢీ కొన్నారు. ఈ సంఘటనలో స్కార్పియో వాహనంలోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. అదే సమయంలో ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక వస్తున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీ కొట్టింది. వాహన డ్రైవర్‌తో పాటు కానిస్టేబుల్‌ రఘునాధరెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కడప రిమ్స్‌కు తరలించారు. ఒంటిమిట్ట సిఐ బాబు, ఎస్‌ఐ శివప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ జరిపారు. స్కార్పియో వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

➡️