- కెనాల్ పడి ఇద్దరు చిన్నారులు, నాన్నమ్మ మృతి
ప్రజాశక్తి-యల్లనూరు (అనంతపురం జిల్లా) : అనంతపురంలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో నాన్నమ్మ ఇంటికొచ్చిన ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మరణించారు. వీరిని కాపాడే ప్రయత్నంలో వారి నాన్నమ్మ కూడా నీటిలో మునిగి మృతి చెందారు. ఈ సంఘటన యల్లనూరు మండలం కల్లూరు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యల్లనూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన డి.శ్రీనివాసులు, డి.ప్రశాంతి దంపతులకు లిడియా (12), జాషువా (9) సంతానం. పిల్లల చదువు నిమిత్తం వీరి కుటుంబం తాడిపత్రిలో నివాసం ఉంటోంది. పాఠశాలకు సెలవులు కావడంతో చిన్నారులు ఇద్దరూ నాన్నమ్మ నాగలక్ష్మమ్మ (68) గ్రామమైన కల్లూరుకు వచ్చారు. బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి నాగలక్ష్మమ్మ గ్రామ సమీపంలోని కెనాల్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కెనాల్లో పడి మునిగిపోతున్నారు. దీనిని చూసిన నాగలక్ష్మమ్మ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా నీటి ప్రవాహంలో చిన్నారులతో సహా కొట్టుకుపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని స్థానికులు గమనించి బయటకు తీశారు. అప్పటికే ముగ్గురూ మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రామాంజనేయరెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.