ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఎపి ఐసెట్ – 2025 బుధవారం రెండు సెషన్లుగా జరగనుందని ఎపి ఐసెట్ చైర్మన్, ఎయు విసి ఆచార్య జిపి.రాజశేఖర్ తెలిపారు. విశాఖలోని వర్సిటీ పాలక మండలి సమావేశ మందిరంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇఎన్.ధనుంజయరావు, సెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశిలతో కలిసి పరీక్షా వివరాలను ఆయన మంగళవారం వెల్లడించారు. ఈ పరీక్షకు మన రాష్ట్రంతోపాటు హైదరాబాద్లో 94 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 37,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి బుధవారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందన్నారు. ఉదయం సెషన్లో పరీక్ష రాసేవారికి ఉదయం 7:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం సెషన్లో పరీక్షలు రాసేవారికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారని వెల్లడించారు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు తమ హాల్ టికెట్, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలన్నారు. హాల్ టికెట్లను షవ్ర.aజూరషష్ట్రవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపరిచామని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. కన్వీనర్ ఆచార్య ఎం.శశి మాట్లాడుతూ పరీక్ష అనంతరం ప్రాథమిక కీని విడుదల చేసి, అనంతరం ఈ నెల 21న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.
