cet రెండు సెషన్స్లో నిర్వహణ
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎపి ఇసెట్ చైర్మన్, జెఎన్టియు విసి హెచ్ సుదర్శనరావు
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జెఎన్టియు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎపి ఇసెట్- 2025 పరీక్ష మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర వివరాలపై ఎపి ఇసెట్ చైర్మన్, అనంతపురం జెఎన్టియు విసి హెచ్.సుదర్శన్రావు సోమవారం అనంతపురం జెఎన్టియు పరిపాలన భవనంలోని ఉపకులపతి కాన్ఫరెన్స్ హాల్లో విలేకరులకు వెల్లడించారు. ఎపి ఇసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 35,187 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా 11,029 దరఖాస్తులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు 9,416, మెకానికల్ ఇంజనీరింగ్కు 4,757, సివిల్ ఇంజనీరింగ్కు 3,050 దరఖాస్తు అందాయని తెలిపారు. వీటితోపాటు ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర విభాగాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 110 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో రాష్ట్రంలో 109, హైదరాబాద్లో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి అభ్యర్థి మంగళవారం జరిగే పరీక్షకు ఉదయం సెషన్కు 7:30 గంటలకు, సాయంత్రం సెషన్కు 12:30 గంటలకు పరీక్ష హాల్లోకి రావాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులూ తీసుకురాకూడదని స్పష్టం చేశారు. హాల్ టికెట్, ఎపి ఇసెట్ దరఖాస్తు ఫారం, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఐడి కార్డ్ మాత్రమే విద్యార్థులు వారి వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షలను ఒఎంఆర్ సీట్ పద్ధతిలో రాయాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో జెఎన్టియు రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, ఎపి ఇసెట్ కో కన్వీనర్, అడ్వైజర్ టిఆర్.భానుమూర్తి, పిఆర్ఒ ఓంప్రకాష్ పాల్గొన్నారు.
