మొబైల్‌ ఫోన్లకే ట్రాఫిక్‌ చలాన్లు..!

హైదరాబాద్‌ : వాహన చోదకులు ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు. అయితే వాహనదారులు చెక్‌ చేసుకుంటేనో..లేక ఎక్కడైనా వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు నిలుపుదల చేసిన సమయంలో ఎన్ని చెలాన్లు పెండింగ్లో ఉన్నాయో.. ఎంత చెల్లించాలో తెలిసేది. తమ వాహనంపై ఎన్ని చెలాన్లు ఉన్నాయో తెలియకపోవడంతో వాహనదారులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చెలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది.
ఈ నేపథ్యంలో రవాణా శాఖ చలనాల చెల్లింపులకు కొత్త ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ నియమాలు అతిక్రమించిన సందర్భంలో నేరుగా వాహనదారుడి మొబైల్‌ నెంబర్‌ కు ట్రాఫిక్‌ చలాన్‌ లు పంపించడంతో పాటు వాటిని సులభతరంగా చెల్లింపులకు కూడా గుగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, భీమ్‌ యాప్‌, యూపీఐ అప్షన్స్‌ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. వాహన దారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్‌ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
దీంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అయితే ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. టాఫిక్‌ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు నేరుగా వాట్సాప్‌ లేదా మెసేజ్‌ రూపంలో చలానా పంపే విధానం తీసుకువస్తే వాహనదారులకు చెల్లింపులు సులభతరం అవుతాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

➡️