- మెట్రో వేళలు పొడిగింపు
హైదరాబాద్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు వెళ్లాలని సూచించారు.
నేడు మెట్రో వేళలు పొడిగింపు –
రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే, మిగతా మార్గాలలో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు. మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు.