- తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి
ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టు అధ్యాపకుడిని ఆయన మేనల్లుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యను కళ్లారా చూసిన అధ్యాపకుడి భార్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పామిడి మండల కేంద్రానికి చెందిన మూర్తిరావు గోఖలే (59), ఆయన భార్య శోభ (56)లు అనంతపురంలోని జెఎన్టియు కళాశాల వద్ద ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మూర్తిరావు అనంతపురంలోని అనంత లక్ష్మి ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసేవారు. ఇటీవల ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఎస్కె యూనివర్సిటీలో ప్రయివేటు అధ్యాపకునిగా చేరారు. శోభ శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరి ఉన్నత పాఠశాలలో బయాలజీ సహాయకురాలిగా పని చేస్తున్నారు. మూర్తిరావుకు తన అక్క కుమారుడు ఆదిత్యతో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవడంతో ఆదిత్య ఆయనపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ఆదివారం రాత్రి మూర్తిరావు ఇంటికి వచ్చి ఉద్యోగం విషయంపై గొడవపడ్డాడు. ఈ ఘర్షణ అధికమై మూర్తిరావును ఆదిత్య తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మూర్తిరావు అక్కడిక్కడే మరణించారు. కళ్లేదుటే భర్త మరణాన్ని చూసిన శోభ షాక్కు గురై అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం వేకువజామున మరణించారు. ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.