చెట్టుకూలి మహిళ మృతి
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం)
విశాఖలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. సీతమ్మధారలోని ఎఎంజి హాస్పిటల్ వద్ద భారీ వృక్షం కూలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళపై పడడంతో అమె మృతి చెందారు. ఈ సంఘటన ఎంవిపి.పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పూర్ణిమ (40) ఎఎంజి హాస్పిటల్కు ఎదురుగా ఉన్న సరిత ఎంక్లేవ్ నాలుగో అంతస్తులో నివాసముంటున్నారు. ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేందుకు బయటకు వచ్చారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆమెపై చెట్టు పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెట్టు కూలడంతో అక్కడే ఉన్న కారు, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ధ్వంసమయ్యాయి. ప్రమాద స్థలాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, స్థానిక కార్పొరేటర్ పద్మా రెడ్డి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చెట్టు కూలి పూర్ణిమ చనిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో భారీ వృక్షాలు ఎండిపోయి, కొమ్మలు ఊడి పడుతూ ఉంటాయన్న విషయం తెలిసినప్పటికీ జివిఎంసి హార్టికల్చర్ విభాగం అధికారులు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని తెలిపారు. అయితే, మహిళ మృతిచెందిన ఘటన తరువాత జివిఎంసి స్పందించింది. ఆ ప్రాంతంలో చెట్ల కొమ్మలను తొలగించే పనులను క్షేత్రస్థాయిలో చేపట్టింది.
