- ఒక నిర్ణయం కోసం అత్యవసర భేటీ
ప్రజాశక్తి- తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెంబర్ 604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఎపిటిఎ)కు చెందిన 24.68 ఎకరాల భూమిని టిటిడికి బదలాయించాలని గతంలో టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే పలుమార్లు హోటల్ నిర్మాణం ఆపాలని నిరసనలు జరగడంతో ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588-ఎ లో ఉన్న టిటిడికి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఎపిటిఎకు బదలాయించేందుకు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. తిరుపతి రూరల్లోని సర్వే నెంబర్ 604లోని ఎపిటిఎకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టిటిడికి, దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నెంబర్ 588-ఎ లోని టిటిడికి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఎపిటిఎకు కేటాయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో టిటిడి ఇఒ జె శ్యామలరావు, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఒ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.