సాగు భూములకు పట్టాలివ్వాలని గిరిజనుల ధర్నా

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు, పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద గిరిజనులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్ర మాట్లాడుతూ.. పార్వతీపురం రూరల్‌ మండలంలోని తాన్నవలస, తొక్కుడువలస గిరిజనులు సాగు చేస్తున్న భూములను సబ్‌ డివిజన్‌ చేసి పట్టాలు ఇవ్వాలని, సంఘంవలస పంచాయితీ సీతంపేట గిరిజనులకు ఇచ్చిన పోడు పట్టాలస్థానే ”డి” పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు లేకపోవడంతో మైనింగ్‌, అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున అదాని, అంబాని లాంటి కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు అప్పజెబుతున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతంలో నీరు లేక గెడ్డలు, చలమల నీరు తాగుతున్నారని, వాటి వల్ల గిరిజనులు జబ్బుల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు మంచినీరు సరఫరా చేయాలని కోరారు. గిరిజన ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్‌ డ్యాంలు పాడైపోయాయని, వాటిని వెంటనే పున:నిర్మించి, కొత్త చెక్‌ డ్యాంలు నిర్మించి గిరిజనులకు సాగు నీరు అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయుకులు కె రామస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, జిల్లా నాయుకులు పి.రాము, గిరిజనులు పాల్గొన్నారు.

➡️