ప్రజాశక్తి-తిరుమల : రథసప్తమికి వచ్చే యాత్రికులకు ఉద్యోగులు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టిటిడి ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. రథసప్తమి రోజున గ్యాలరీలలో యాత్రికులకు అందించే సేవలపై ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి గ్యాలరీకి ఇంఛార్జితో పాటు, అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. పోలీసులు, విజిలెన్స్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి ఉద్యోగి కూడా సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. యాత్రికులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్య, శానిటేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉమ్మడి కార్యాచరణతో సేవలు అందించాలన్నారు. ఉన్నత ప్రమాణాలతో శానిటేషన్ సేవలు అందించాలని సూచించారు. అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి సివిఎస్వో మణికంఠ చందోలు, టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం, ఎఫ్ఏఅండ్ సీఎవో బాలాజీ, సీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
