- రాష్ట్రపతి ఆమోదముద్ర
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరిని నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిం చేందుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం కూడా ఆమోదం చెప్పి రాష్ట్రపతికి నివేదించింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో బుధవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఎపి జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న న్యాయాధికారి అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జి)గా ఉన్న న్యాయాధికారి యడవల్లి లక్ష్మణరావు హైకోర్టు న్యాయ మూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిరువురి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరు తుంది. మరో ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని కొలీజియం వీరిరువురి పేర్లతోపాటు శ్రీకాకుళం జిల్లా జడ్జిగా చేస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫార్సు చేశారు. జునైద్ విషయంలో సుప్రీం కొలీజియం ఏ నిర్ణయం తీసుకున్నదీ వెల్లడికాలేదు.
కర్నూలుకు చెందిన అవధానం
సుబ్బమ్మ, రామచంద్రయ్య దంపతులకు అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న పుట్టారు. స్వస్థలం కర్నూలు. తండ్రి పురోహితులు. కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో శర్మ బిఎస్సి, నెల్లూరు విఆర్ న్యాయ కళాశాలలో లా చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద జూనియర్గా పనిచేశారు. 1998లో సొంతగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబర్లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఎపిలోని పలు జిల్లాల్లో పనిచేశారు. 2017-18లో అనంతపురం, 2020-22లో విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పిడిజె) చేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా చేశారు. 2023 నుంచి ఎపి జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మణరావు
పద్మావతి, వెంకటేశ్వర్లు దంపతులకు యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న పుట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు విఆర్ న్యాయ కళాశాలలో లా చేశారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. జిల్లా జడ్జి పోస్టులకు నిర్వహించిన పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా, ఉమ్మడి ఎపిలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. నాగార్జున వర్సిటీ నుంచి పిజి పూర్తి చేసి మెరిట్ సర్టిఫికెట్లు రెండు సాధించారు. ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులయ్యారు. ఆ తర్వాత రిజిస్ట్రార్ జనరల్గా కొనసాగుతున్నారు.