మట్టి మిద్దె కూలి ఇద్దరు కూలీల మృతి

ప్రజాశక్తి-ఆళ్లగడ్డ : మట్టి మిద్దె కూలి ఇద్దరు కూలీల దుర్మరణం చెందిన ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆర్‌ పాంపల్లె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… ఆర్‌ పాంపల్లె గ్రామానికి చెందిన గంప తిరుపాల్‌ పాత ఇంటికి మరమ్మతులు చేసేందుకు ఏడుగురు కూలీలు పనికి వెళ్లారు. పాత మిద్దె కావడంతో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మట్టి కింద ఉన్న కూలీలపై దంతేలు, మెత్తుపలకలు పడడంతో నలుగురు అందులో ఇరుక్కుని పోయారు.
గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మట్టిలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. వారిలో ఎస్‌.లింగందిన్నె గ్రామానికి చెందిన బండి యోనా (45), ఆర్‌ .పాంపల్లి గ్రామానికి చెందిన పొగాకు నారాయణ (40) మట్టి కింద పూర్తిగా కూరుకొని పోయి ఊపిరాడక మృతి చెందారు. వారి మృతదేహాలను ఉయ్యాలవాడ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన కుమార్‌, బాబులకు అదే ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. మిగిలిన ముగ్గురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

➡️