- ‘ఫాసిజంపై ప్రజాసైన్యం విజయ స్ఫూర్తి’ సభలో ఎంఎ బేబీ
- కార్పొరేట్లకు ఇచ్చిన భూములపై శ్వేతపత్రం : వి. శ్రీనివాసరావు డిమాండ్
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : దేశంలో పెచ్చరిల్లుతున్న నయా ఫాసిస్టు ధోరణులను ఐక్యంగా ప్రతిఘటించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి పిలుపునిచ్చారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ‘ఫాసిజంపై ప్రజాసైన్యం విజయ స్ఫూర్తి’తో బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు ముందు ఆర్టిసి సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అగ్రభాగాన మార్క్సిస్టు మహనీయుల చిత్రపటాలతో ప్రదర్శన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంఎ బేబి మాట్లాడుతూ నయా ఫాసిస్టు ధోరణులను ఎదుర్కునేందుకు విశాల ఐక్యవేదికగా ప్రజలందరినీ కలుపుకుపోవాలని చెప్పారు. ‘ఎనభై ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన ఫాసిజాన్ని ప్రాణాలకు సైతం తెగించి ఎర్రసైన్యం ఎదుర్కొంది. అదే స్ఫూర్తితో నయా ఫాసిస్టు ధోరణులపై కూడా పోరాడాలి’ అని అన్నారు. ఫాసిజంతో హిట్లర్, ముస్సోలిని వంటి కొంతమంది ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తే సోవియట్ రష్యాలో స్టాలిన్ సారథ్యంలో వారిని ఎదుర్కొని ఫాసిజాన్ని కూకటివేళ్లతో నిర్మూలించారని గుర్తు చేశారు. ఫాసిజంపై ఎర్రజెండా మాత్రమే పోరాడిందని, 2.60 కోట్ల మంది ఎర్రసైనికులు తమ ప్రాణాలను అర్పించి దుష్టపాలనను అంతమొందించారని చెప్పారు. పెహల్గాం ఘటన సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరైనది కాదన్నారు.ఏప్రిల్ 22న పెహల్గాం ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. దేశ సమైక్యత కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడాలంటూ సిపిఎం 24వ మహాసభ చేసిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ… పెట్టబడిదారులు తమ లాభాల కోపం పాసిస్టు శక్తులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టులను, మైనార్టీలను, దళితులను, వికలాంగులను నాశనం చేయడమే ఈ శక్తుల లక్ష్యమని అన్నారు.
రాష్ట్రంలోనూ ఫాసిస్టు శక్తులకు మద్దతిచ్చేలా అధికారకూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. పంటను అన్నదాత అమ్ముకోలేని స్థితికి తీసుకువచ్చారని, కౌలు రైతులకు నష్ట పరిహారం లేదని, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడి నుంచి రక్షణ లేదని, ప్రజారక్షకుడని చెప్పుకుంటున్న పవన్కల్యాణ్కు ఇవి పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు ఇచ్చిన భూములు, ఏర్పడిన పరిశ్రమలు, వచ్చిన ఉద్యోగాలు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన కార్పొరేట్ సంస్థల వివరాలతో శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానాలకు భిన్నంగా సిపిఎం ఒకటే రాజకీయ ప్రత్యామ్నాయమని చెప్పారు. . కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో తమను కాపాడిన ముస్లిములను బాధితులు కొనియాడితే వారి వ్యక్తత్వాన్ని కించపరిచేలా దూషించడం సరైనది కాదన్నారు. కులంతర వివాహం చేసుకుందని తిరుపతి జిల్లాలో ఓ తల్లి తన కూతుర్ని చంపారని, జిల్లా వాసైన సిఎం చంద్రబాబు కనీసం ఖండించకపోవడం దారుణ మన్నారు. జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, జనార్ధన్, టి.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఎంఎ బేబీకి ఘన స్వాగతం
న్యూఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఎంఎ బేబీకి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, నేతలు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం, కెఎస్ఎస్ ప్రసాదరావు, హరినాథ్; ఈశ్వరి తదితరులు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటి సారి.