ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వంలో విలీనం అయ్యాక గత ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలను నిర్లక్ష్యం చేసిందని ఎపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు విమర్శించారు. కారుణ్య నియామకాలు తప్ప ఏ కేటగిరిలోనూ ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకునేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆదివారం విజయవాడలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలిశెట్టి దామోదరరావు, జివి నర్సయ్యతో కలిసి మాట్లాడారు. ఆర్టిసిలో నెలకొన్న సమస్యలపై సోమవారం సిఎం సమక్షంలో జరిగే సమీక్షలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నీ కేటగిరీలలో వున్న పది వేల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల వైద్య సేవలకు సంబంధించి గతంలో వున్న పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. మెడికల్ అన్ ఫిట్ అయిన ఆర్టిసి ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూపాలన్నారు. విలీనం అనంతరం పెండింగులో వున్న ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగుల భద్రతకు సంబంధించి 2019 సర్క్యులర్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
