- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్పూర్తితో ప్రజాపోరాటాలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి ఫోటోకు పూలదండ వేసి నివాళులు అర్పించిన అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1924లో అల్లూరి ప్రాణత్యాగం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రపోరాటంలో గిరిజనులను కూడగట్టి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. గిరిజనులకు జరుగుతున్న దోపిడీ నుంచి కూడా వారిని విముక్తి చేసేందుకు ఆయన జీవితాంతం పోరాడారన్నారు. నేడు పాలకవర్గాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములు, అటవీ సంపదతో పాటు గనులనూ అదాని, అమిత్షా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. గిరిజనుల రక్షణకు 1/70 యాక్ట్తో పాటు గ్రామ సభలకు అధికారాలు ఉన్నాయన్నారు. కులగణన జరపాలని సిపిఎంతో పాటు అనేక విపక్షాలు డిమాండ్ చేస్తే ఇది అర్భన్ నక్సలిజం అని కబుర్లు చెప్పిన మోడీ నేడు చేపడతామని అంగీకరించారన్నారు. డిఎస్సి రిక్రూట్మెంట్లో ఆదివాసీలకు న్యాయం చేయాలి. జీఓ నెంబరు 3ని వేరే రూపంలో పునరుద్దరిస్తామని అరకు పర్యటనలో సిఎం చంద్రబాబు చెప్పారని, దానిని పునరుద్ధరించకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. 1600 పోస్టులకు గాను 54 పోస్టులకు గిరిజనులకు దక్కుతాయన్నారు. రెండు రోజుల పాటు గిరిజనుల బంద్ విజయవంతం కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం చర్చలకు సిద్ధపడిందన్నారు. జీఓ నెంబరు 3ని వేరే రూపంలో పునరుద్ధరిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్నారు. ఇప్పటికే 1200మంది తాత్కాలిక ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారని, గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలిచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. బలరాం మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితమంతా గమనిస్తే పరిశీలించడం, అధ్యయనం చేయడం, ప్రజలను కూడగట్టడంతో పోరాటాలు చేసేవారన్నారు. పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లూరి నడయాడిన నేలలో ఆనాటి చారిత్రక చిహ్నాలు కనుమరుగయ్యే ప్రమాదముందని, ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్టుమెంట్ చిహ్నాలను భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, బి.తులసీదాస్, ఎవి నాగేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు వై.కేశవరావు, ఆండ్ర మాల్యాద్రి, వై.అచ్యుతరావు, కె.హరికిషోర్, ఎం. హరిబాబు, రామన్న, అనిల్, రామ్మోహన్, గుండు నారాయణ తదితరులు పాల్గొన్నారు.