సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వియత్నాంలో జరిగిన స్థాయిలో పోరాటాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదని, ఆ దేశ వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. నాడు అమెరికాను యుద్ధంలో తరిమికొట్టి దేశంగా వియత్నాం చరిత్రలో నిలిచిందన్నారు. వియత్నాం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ఇటీవల జరిగాయని, ఈ వేడుకలకు సిపిఐ ప్రతినిధిగా తాను హాజరుకావడం గర్వంగా ఉందన్నారు. వియత్నాం పర్యటన ముగించుకుని రామకృష్ణ రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యాన ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంగా అన్నింటా వియత్నాం విరాజిల్లుతోందని, విద్యా సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఎంతో విశిష్టత సాధించిందని తెలిపారు. లాస్ ఏంజిల్స్, డల్లాస్ నగరాలకు ధీటుగా వియత్నాం దేశ రాజధాని హనోరు సిటీ అభివృద్ధి చెందిందన్నారు. వియత్నాంలో 30 ఏళ్ల కిందట దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు 70 శాతం మంది ఉండగా, ప్రస్తుతం అది 1.9 శాతం తగ్గిందని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, ప్రోగ్రెసివ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు అక్కినేని చంద్రరావు, రాజారావు తదితరులు మాట్లాడారు.
