గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి హామీ
సానుకూల నిర్ణయం రాకపోతే 9న భవిష్యత్తు కార్యాచరణ : ఆదివాసీ నాయకులు
ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : ఈ నెల 8న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు స్పెషల్ డిఎస్సిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ నాయకులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. దీనిపై నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలకు మేలు చేసే విధంగా సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని ఆమెను కోరారు. ఏజెన్సీ ప్రాంత స్పెషల్ డిఎస్సి ప్రకటిం చాలని కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్త ఏజెన్నీ బంద్ నిర్వహించిన నేపథ్యంలో చర్చలకు రావాలని నాయకులను పాడేరు కలెక్టర్ ద్వారా మంత్రి సంధ్యారాణి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో నాయకులు కిల్లో సురేంద్ర పి.అప్పలనర్స, ఎస్.మాణిక్యం, శాంతకుమారి, కె.రాధాకృష్ణ, కాంతారావు, ఆర్.జగన్ తదితరులు ఆమెను సాలూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారంకలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సితో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని ఐటిడిఎల పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను మెగా డిఎస్సి నుంచి మినహాయించి ఈ పోస్టులకు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ, ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రితో భేటీ అనంతరం నాయకులు మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో సానుకూల నిర్ణయం రాకపోతే 9న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 15తో డిఎస్సి దరఖాస్తుకు గడువు ముగియనుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెంబర్ 3కు ప్రత్యామ్నాయ జిఒ లేదా ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని కలిసిన వారిలో కుడుముల కాంతారావు, వెంకటరమణ, రామస్వామి చెండా కేశవరావు, కె.సత్యనారాయణ, మర్రి చిట్టిబాబు, సీదరపు అప్పారావు, పి.దేముడు, తదితరులు ఉన్నారు.
