ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : చేనేత కార్మికులకు లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ. 33 కోట్లను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చిన్నచూపునకు గురైన చేనేత రంగాన్ని సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. నేతన్నలకు నిరంతర ఉపాధి కలగడమే కాకుండా, వారి జీవనోపాధి మెరుగుపడడానికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కఅషి చేస్తున్నామన్నారు. ఈ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ, స్కిల్స్ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకునే విధంగా కొండ లక్ష్మణ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టి)ని స్థాపించుకొన్నామన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు (డిహెచ్టిటి) అందింస్తున్నట్లు తెలిపారు. పవర్లూమ్ ఆసామీల దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్కరించేందుకు వేములవాడలో ప్రభుత్వం యార్న్ డిపో స్థాపించిందని చెప్పారు. చేనేత అభయహస్త పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేతన్న చేయూత పథకం ద్వారా రూ.290.09 కోట్లు విడుదల చేసి, 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చామని, రూ.494.48 కోట్లు విడుదల చేసి, చేనేత సహకార సంఘాలు, ఎస్ఎస్ఐ, మాక్స్ సంస్థలకు పెండింగ్ చెల్లింపులు చెల్ల్చింఆమని వివరించారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31 లోపు రూ. లక్ష లోపు రుణం తీసుకున్న వారు ఈ రుణమాఫీకి అర్హులని తెలిపారు. నేతన్న బీమా పథకం కింద రూ. పది లక్షల బీమా కల్పిస్తూ, వయోపరిమితిని తొలగించి, నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సహకార సంఘాల నుండి స్టాకులను కొనుగోలు చేసి, చెల్లింపులకు నిధులు సమయానికి విడుదల చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
