హైదరాబాద్ : జెఇఇ మెయిన్ తొలి విడత ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా జెఇఇ ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం జనవరి 22-29 తేదీల మధ్య పేపర్ -1 జెఇఇ మెయిన్ సెషన్ -1 (జనవరి 2025) పరీక్ష, 30వ తేదీన జరిగిన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రాధమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్ తొలి విడత ర్యాంకులు ప్రకటించనున్నారు.
