- సిపిఎం పొలిట్బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : ఇటీవల విడుదల చేసిసిన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) నిబంధనలు- 2025 ముసాయిదాను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. ఆ పార్టీ పొలిట్బ్యూరో బుధవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం సవవరించిన నిబంధన రాష్ట్రాల హక్కులపై నేరుగా దాడి చేయడమేనని పొలిట్బ్యూరో విమర్శించింది. వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే అధికారం గవర్నర్-ఛాన్సలర్ నియమించే ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీకి కట్టబెట్టడాన్ని, పైగా ఈ కమిటీకి గవర్నరే చైర్పర్సన్గా ఉండటాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. ప్రస్తుతం కొన్ని ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో వైస్ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ నిబంధన తీసుకు రావడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించింది. ఈ సెలక్షన్ కమిటీలో ఎవర్ని నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని, ఈ నిబంధనతో గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తనకు నచ్చిన వైస్ఛాన్సర్లలను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోందని పొలిట్బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముసాయిదా ద్వారా విద్య అనేది ఉమ్మడి జాబితాకు చెందుతుందనే రాజ్యాంగ నిబంధనను కేంద్రం ఉల్లంఘించిందని పొలిట్బ్యూరో విమర్శించింది. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని ప్రజాస్వామిక వర్గాలు ఈ ప్రమాదకరమైన నిబంధనను ఐక్యంగా వ్యతిరేకించాలని పొలిట్బ్యూరో విజ్ఞప్తి చేసింది.