మరొక మహిళకు తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : నగరంలోని కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందజేసిన సమాచారం ప్రకారం, కంచరపాలెం సమీపంలోని బర్మా క్యాంపు కు చెందిన నిమిడిపల్లి మేరీ (62), ఆమె కుమార్తె సుధారాణి (42) ఇద్దరూ కలిసి స్కూటీపై తెల్లవారుజామున కంచరపాలెంలోని చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఊర్వశి జంక్షన్ వద్ద రోడ్డును క్రాస్ చేస్తుండగా, విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వస్తున్న లగ్జరీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో స్కూటీపై వెనుక కూర్చున్న మేరీ అక్కడికక్కడే మరణించగా, స్కూటీ నడుపుతున్న కుమార్తె సుధారాణి కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకొని సుధారాణిని ఆసుపత్రికి తరలించారు. కంచరపాలెం ట్రాఫిక్ సిఐ దాశరథి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్ళవలసిన ఇందిరా లగ్జరీ బస్సు అతివేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మృతురాలు మేరీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించడం జరిగిందని తెలిపారు.
