ప్రజాశక్తి – కడప అర్బన్ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప నగర పురవీధులు దద్దరిల్లాయి. వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున బుధవారం ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ నగరంలోని అల్మాస్పేట సర్కిల్ నుంచి ప్రారంభమై మట్టి పెద్దపులి వీధి, వన్టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్ మీదుగా ఏడు రోడ్ల సర్కిల్ వరకు సాగింది. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వక్ఫ్ పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ రిజ్వానా, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు భాగ్యమ్మ, వైసిపి మహిళా భాగం నాయకులు మరియం, ఎస్డిపిఐ నాయకులు సోఫియా ఖానం, సాజియా, పీస్ స్కూల్ జుబైదా ప్రసంగించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి త్రిపుల్ తలాక్, హిజాబ్, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లిములను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వక్ఫ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వక్ఫ్ చట్ట సవరణ చేసిందని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం ముస్లిముల ద్రోహి అని విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణకు అనుకూలంగా పార్లమెంటులో టిడిపి ఓటు వేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకుని బయటపడినప్పుడే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించారు.
