వైఎస్‌ అభిషేక్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

  • భౌతికకాయానికి నివాళులర్పించిన జగన్‌

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు, వైసిపి నాయకులు డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని అదేరోజు రాత్రి పులివెందులలోని ఆయన నివాసానికి తరలించారు. బెంగళూరు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుని అభిషేక్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అభిషేక్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసి జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. పులివెందులలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అభిషేక్‌రెడ్డికి కడప ఎంపి వైఎస్‌.అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, శాసనమండలి మాజీ చైర్మన్‌ సతీష్‌ కుమార్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్‌.ప్రమీలమ్మ, వైఎస్‌.ప్రతాప్‌ రెడ్డి, పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి నివాళులర్పించారు.

➡️