జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించండి ప్రాణహాని ఉంది : హైకోర్టులో వైఎస్‌ జగన్‌ మరో పిటిషన్‌

ప్రజాశక్తి-అమరావతి : తనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను తిరిగి కల్పించేలా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సిఆర్‌పిఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌ఓలతో భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో తెలిపారు. తనకున్న ప్రాణహానిపై తాజాగా, స్వతంత్రంగా మదింపు చేయాలని, తనకు జెడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్దరించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, ఆఫీసు వద్ద భద్రత, పనిచేసే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కల్పించాలని, ఇవి కల్పించని పక్షంలో తన సొంత బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వాడుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. సిఎంగా ఉండగా జెడ్‌ ప్లస్‌ భద్రత ఉండేదని, అధికారం కోల్పోవడంతో ఆ భద్రతను అన్యాయంగా ఏకపక్షంగా కుదించారని, ప్రాణహానిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో తెలిపారు. అధికార కూటమి నుంచి భౌతికంగా హానిచేస్తామనే బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పారు. ఇదే అంశంపై గతంలో వేసిన పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, వైసిపి ఎంపీలు, సీనియర్‌ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు వినతులు సమర్పించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఫిబ్రవరిలో గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులను కలిసేందుకు వెళితే ఒక్క కానిస్టేబుల్‌ కూడా లేరని, శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది గ్రామం నుంచి తన తిరుగు ప్రయాణం సందర్భంగా తీవ్రమైన భద్రతా లోపాలను బట్టబయలయ్యాయని, హెలీప్యాడ్‌ వల్ల భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయని పిటిషన్‌లో తెలిపారు. వైసిపి నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారణ చేసే అవకాశముంది.

➡️