ఇరాన్ అధ్యక్షులు పెజెష్కియాన్
ఇస్లామాబాద్ : అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం (ఎంఒయులో ఇరాన్ క్షిపణి కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ క్షిపణి సామర్థ్యాలను ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగం చేయబోమని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన సాంకేతిక చర్చల అనంతరం ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ రక్షణ సామర్థ్యాలతో ముడిపెట్టే ప్రయత్నాలను ఆయన తిరస్కరించారు. దేశ రక్షణ వ్యూహంలో క్షిపణి వ్యవస్థలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇరాన్ భద్రత కోసం క్షిపణి సామర్థ్యం అత్యవసరమని పెజెష్కియన్ వ్యాఖ్యానించారు. తమ దేశ రక్షణ కోసం ఉన్న క్షిపణులు లేకపోయి ఉంటే ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీసేవని ఆయన అన్నారు. ఇరాన్ తన రక్షణ అవసరాల దృష్ట్యా క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని, దానిపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.







కామెంట్లు (0)