- స్ర్తీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి
- మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ‘బాలామృతం ప్లస్’ పంపిణీ
ప్రజాశక్తి - సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి కార్యాలయంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ‘పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యవంతమైన బాల్యం’ అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో కమ్యూనిటీ ఆధారిత తీవ్ర పోషకాహార లోప నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యంతో ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ఎన్టిఆర్, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో ప్రాథమికంగా 24 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఆయా జిల్లాల్లోని ఏడు నెలల నుంచి ఐదేళ్ల వయస్సుగల సుమారు ఐదు వేలమంది తీవ్రమైన పోషకాహార లోపం), మధ్యస్థ పోషకాహార లోపం కలిగిన చిన్నారులను గుర్తించి వారికి పౌష్టికాహారాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి చిన్నారికి నెలకు మూడు కిలోల చొప్పున అత్యధిక శక్తినిచ్చే ‘ఎనర్జీ డెన్స్ న్యూట్రిషియస్ ఫుడ్’ను పంపిణీ చేయనున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇది సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆ కార్యక్రమంలో పలువురు అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)