నేపాల్ : ఆరు రోజులుగా నేపాల్ ను వరదలు వణికిస్తున్నాయి. ఈ జలప్రళయంలో ప్రాణనష్టం అంతకంతకూ పెరుగుతుండగా.. గల్లంతైనవారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రోపవర్ ప్రాజెక్టులు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి. ఆయా ప్రాజెక్టుల సొరంగాల్లో 933 మందికిపైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఆర్మీ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 903 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2,500 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైనవారిలో సుమారు 500 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య, గల్లంతైనవారి వివరాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
హిమానీనదాల శిథిలాలు, భారీ బండరాళ్ల కారణంగా చైనా-నేపాల్ సరిహద్దులో ఓ సరస్సు ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. ఈ పరిణామంతో బోటెకోషి నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద పరిస్థితులపై చైనా అందిస్తున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. దిగువ ప్రాంతాల్లోని ప్రజలను నేపాల్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం వరద హెచ్చరికలకు సంబంధించిన సందేశాలు దిగువ ప్రాంతాల్లోని ప్రజల ఫోన్లకు వరుసగా వచ్చాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి.. ఇళ్లు,ఆస్తులు కోల్పోయి నిలువనీడ లేకుండా ఉన్న బాధితులకు ఈ వరద అలర్ట్లు మరింత ఆందోళన కలిగించాయి. మరోసారి వరద ముప్పు ఉందన్న హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా .... మరోవైపు త్రిశూలీ నదిలో ఆదివారం భారీగా వరద పోటెత్తింది. దాదాపు మూడు గంటలపాటు నదిలో నీటి ప్రవాహం తీవ్రంగా కొనసాగింది. ఈ ఉధృతికి 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాకపోకలకు మరింత అంతరాయం ఏర్పడింది.







కామెంట్లు (0)