భారత్లో ముగిసిన యుఎస్ వాణిజ్య బృందం పర్యటన
న్యూఢిల్లీ : భారత్, అమెరికా వాణిజ్య చర్చల్లో గణనీయ పురోగతి సాధించినట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలియచేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ రెండు రోజుల పర్యటన ముగిసిన నేపథ్యంలో వాణిజ్య శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో పలుసార్లు సమావేశమయ్యారు. తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలోని, అలాగే విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)లోని కీలక అంశాలను వారు సమీక్షించారు. ఈ ఒప్పందాలపై ఇటీవలి మాసాల్లో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఉభయ పక్షాలు పేర్కొన్నాయి. అయితే ఎప్పటిలోగా ఈ ఒప్పందాలు ఖరారు చేసుకోవాలో నిర్దిష్టంగా గడువును విధించలేదు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించారు, అదే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుల నాటికి పూర్తవాల్సి వుంది. ఇక తాత్కాలిక ఒప్పందం చట్రపరిధిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సంతకాలు జరిగాయి. ఏప్రిల్-మే మాసాలకల్లా పూర్తవాల్సి వుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఇరు దేశాలు విడుదలచేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి, పరస్పరం లబ్ది చేకూరేలా సమతూకంతో కూడిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని మందుకు తీసుకెళ్ళడానికి జరుగుతున్న కృషిలో గ్రీర్ పర్యటన కీలకమైన అడుగు అని ఆ ప్రకటన పేర్కొంది. మార్కెట్ సౌలభ్యం పెంపు, డిజిటల్ వాణిజ్యం, ఇబ్బందుల్లేని సరఫరా క్రమం, టారిఫ్యేతర అడ్డంకులను తగ్గించడం, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంతో సహా కీలకమైన అంశాలను సమగ్రంగా ఇరువురు సమీక్షించినట్లు ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో కొత్తగా ఆవిర్భవిస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్, అమెరికా ఆర్థిక భాగస్వామ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇరు పక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలన్న లక్ష్య సాధన పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఆ ప్రకటన పేర్కొంది.







కామెంట్లు (0)