ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ ( గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో బుధవారం ప్రారంభమైన క్రికెట్ సంబరాలు క్రీడాకారులు అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్)-2026 చివరి దశ మ్యాచ్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. తొలి మ్యాచ్ లో సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు విజయం సాధించింది. తొలుత సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. జట్టు బ్యాట్స్ మెన్ రికీబోయి (111) పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. ధనుష్ 26 పరుగులు, బి వినయ్ కుమార్ 17 పరుగులు, కే మహిప్ కుమార్ 16 పరుగులు సాధించారు. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 186 పరుగులు చేసి ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడగా, టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
27న లీగ్ దశ ముగియనుండగా, 28 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30న జరిగే ఫైనల్తో టోర్నీకి తెరపడనుంది. ఏడు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భీమవరం బుల్స్ ఆరు మ్యాచ్ల్లో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశ ముగిసే సమయానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించనున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లపై ఆసక్తి నెలకొంది.








కామెంట్లు (0)