ఇంగ్లండ్ - ఘనా మ్యాచ్ డ్రా
పనామాపై చెమటోడ్చి నెగ్గిన క్రొయేషియా
న్యూయార్క్: ఫిపా ప్రపంచకప్-2026 నాకౌట్లోకి కొలంబియా జట్టు అడుగుపెట్టింది. గ్రూప్-కెలో భాగంగా బుధవారం డి.ఆర్. కాంగోతో జరిగిన మ్యాచ్లో కొలంబియా 1-0తో విజయాన్ని సాధించింది. కొలంబియా తరఫున డానియెల్ మునోజ్ 74వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో ఈ గ్రూప్ నుంచి రెండు విజయాలతో కొలంబియా రౌండ్ ఆఫ్-32కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో కొలంబియా పదే పదే కాంగో గోల్ పోస్టులపై దాడి చేసినా.. ఆ జట్టు గోల్ కీపర్ లియోనల్ పాసి అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్ధి జట్టు ఎక్కువ గోల్స్ చేయకుండా నిలువరించాడు. డిఆర్ కాంగో-కొలంబియా మ్యాచ్ జరిగిన స్టేడియంలో 90 శాతానికి పైగా అభిమానులు కొలంబియాకు చెందినవారే. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కాంగోకు చెందిన మిచెల్ కుకా మ్బోలాడింగా. తమ జాతీయ జెండా రంగులను సూట్ రూపంలో ధరించిన మిచెల్, మ్యాచ్ జరిగినంత సేపు స్టాండ్లో ఒక కుర్చీపై ఇంచు కూడా కదలకుండా కుడి చేతిచేతిని పైకెత్తి 90 నిమిషాల పాటు శిలా విగ్రహంలా నిలబడ్డాడు. ఇదంతా ఎందుకా అని ఆరా తీస్తే.. వీసా సమస్య కారణంగా కాంగో ఆడిన మొదటి మ్యాచ్ చూసే అవకాశం మిచెల్ కుకాకు లభించలేదు. వీసా క్లియరెన్స్ రావడంతో అమెరికాలో అడుగుపెట్టిన అతడి విచిత్ర వేషధారణ చూసి కొలంబియన్ అభిమానులు భారీ కేరింతలతో స్టేడియంలోకి స్వాగతించడం విశేషం. ఇదే గ్రూప్లో ఉన్న పోర్చుగల్ అంతకుముందు ఉజ్బెకిస్తాన్పై 5-0తో విజయం సాధించింది. జరిగే చివరి గేమ్లో పోర్చుగల్తో కొలంబియా, డిఆర్ కాంగోతో ఉబ్జెకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఇంగ్లండ్ను నిలువరించి ఘనా
బోస్టన్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్ను ఘనా డ్రా చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. 2024లో నుంచి వరుసగా 12 విజయాలతో అదరగొట్టిన ఇంగ్లండ్ జోరుకు ఘనా డ్రా రూపంలో అడ్డుకట్ట వేసింది. 2024లో గ్రీస్పై విజయం తర్వాత ఇంగ్లండ్ తాను ఆడిన 12 అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఘనాపై ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 19 సార్లు ఘనా గోల్ పోస్ట్పై దాడులు చేసినప్పటికీ ఆ జట్టు గోల్కీపర్ బెంజమిన్ అసారే అడ్డుగోడలా నిలబడి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. దీంతో చెరో పాయింట్ దక్కించుకున్న ఇంగ్లండ్, ఘనాలు చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. క్రొయేషియా 3పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. గ్రూప్ లీగ్ చివ రి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు పనామాతో, ఘనా క్రొయేషియాతో తలపడనున్నాయి.
లూకా మోడ్రిక్కు 200వ మ్యాచ్...
తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన క్రొయేషియా జట్టు పనామాపై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. క్రొయేషియా తరఫున 54వ నిమిషంలో బుడిమిర్ గోల్ కొట్టాడు. దీంతో క్రొయేషియా 1-0తో విజయం సాధించింది. క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్కు ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. అంతర్జాతీయ ఫుట్బాల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా లూకా మోడ్రిక్ నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (230), బాదర్ అహ్మద్ (202), లియోనల్ మెస్సీ (201) ఈ ఫీట్ సాధించారు. మరోవైపు పనామా జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడి టోర్నీ నుంంచి నిష్ర్కమించింది. క్రొయేషియా చేతిలో ఓటమితో ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లన్నింటిలోనూ ఓటమి చవిచూసిన జట్టుగా నిలిచింది. ఇంతకుముందు ఎల్ సాల్వడార్ జట్టు ఆరు ఫిఫా మ్యాచ్లు ఆడితే ఆరింటిలోనూ ఓడింది.

కొలంబియాతో మ్యాచ్ సందర్భంగా డిఆర్ కాంగో అభిమాని మిచెల్ కుకా ఆట జరుగుతున్నంత సేపు ఇలా స్టేడియంలో నిల్చోనే ఉన్నాడు.








కామెంట్లు (0)