mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కేసు: లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు

11 గంటల క్రితం

sai krishna case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కొనసాగుతున్న సిట్‌ ‌విచారణ

  • సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌ ‌విచారణ జులై 1కి వాయిదా

ప్రజాశక్తి- విజయవాడ : సాయికృష్ణ లాకప్‌‌డెత్‌ కేసులో ‌నిందితులుగా ఉన్న ఇద్దరు హెడ్‌ ‌కానిస్టేబుళ్లు అశోక్‌, నాని సోమవారం విజయవాడ సూర్యారావుపేటలోని ఎసిపి కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. వీరు వారం రోజులపాటు అజ్ఞాతంలో ఉన్నారు. సిఐ నాగరాజు అరెస్ట్ అయిన రోజు నుంచి వీరు పరారీలో ఉన్నారు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌ చేశారు. వారి కుటుంబ సభ్యులకు కూడా వీరు ఎక్కడున్నారో తెలియదని సిట్‌ అధికారులు చెబుతూ వస్తున్నారు. లాకప్‌‌డెత్‌ ‌కేసులో వీరిద్దరి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు సిట్‌ ‌గుర్తించింది. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. విధులకు గైర్హాజరవుతున్నందున విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్ బాబు వీరిద్దరినీ రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆయన తల్లి విజయలక్ష్మి హైకోర్టులో వేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌, సిబిఐ లేదా న్యాయ విచారణ కోరుతూ అనుబంధ పిటిషన్‌ ‌విచారణకు వచ్చిన రోజునే వారు లొంగిపోవడం గమనార్హం. సిఐ నాగరాజు, ఆయన స్నేహితుడు సురేష్‌, ఈ ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు కూడా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లొంగిపోయిన హెడ్‌ కానిస్టేబుళ్లను సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే టాస్క్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్‌ ‌మురళీకృష్ణ, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బాబూరావును కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు.

కస్టడీ పిటిషన్‌ ‌విచారణ

మరోవైపు ఇదే కేసులో పోలీసులు అరెస్టు చేసిన, రాజమహేంద్రవరం సెంట్రల్‌ ‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సిఐ నాగరాజును 12 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ వేసిన పిటిషన్‌ విచారణను కోర్టు జులై ఒకటో తేదీకి వాయిదా వేసింది. అరెస్ట్ చేసినప్పుడు చాలా తక్కువ సమయం ఉండటంతో సిఐ నుండి పూర్తి స్థాయి సమాచారం సేకరించలేకపోయామని, ఆయన సరిగా సమాధానం కూడా చెప్పలేదని, ఈ నేపథ్యంలో సిఐని పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని సిట్‌ ‌తన పిటిషన్‌‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ ‌మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌‌పై విచారణ వాయిదా

గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు జులై 15కు వాయిదా వేసింది. సోమవారం కోర్టు సమయం ముగియడంతో పిటిషన్‌పై విచారణ చేపట్టడం సాధ్యం కాకపోవడంతో తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ సుభేందు శమంతతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. తన కుమారుడు గాదె సాయి కృష్ణను హైకోర్టు ముందు హాజరుపర్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గత విచారణలో సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపర్చాలని ఆదేశించిన ధర్మాసనం కేసును ఈ నెల 29కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిబిఐ లేదా మరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని కోరుతూ విజయలక్ష్మి తాజాగా అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణ జాబితాలోకి రాగా, కోర్టు ప్రారంభమైన వెంటనే విజయలక్ష్మి తరపున న్యాయవాది స్పందిస్తూ.. గతంలో ఉన్న న్యాయవాదిని మార్చుకున్నామని, కొత్త వకాలత్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్