విచారిస్తున్న సిట్ అధికారులు
అరెస్ట్ సమయంలో ఇంటి వద్ద ఉద్రిక్తత
ప్రజాశక్తి- విజయవాడ : సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెన్షన్కు గురైన విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజును మంగళవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ సింగ్ నగర్ షాదీఖానా సమీపంలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్న ఆయనను అరెస్టు చేసి నగరంలోని స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించారు. సిఐ అరెస్ట్ సమయంలో టిడిపి, జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సిఐను అరెస్ట్ చేయొద్దని నినాదాలు చేశారు. ‘వియ్ స్టాండ్ విత్ యు సర్’ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. సిఐను తరలిస్తున్న వాహనం ముందుకు కదలనీయకపోవడంతో పోలీసులు వారిని పక్కకు తొలగించి పోలీసు స్టేట్ గెస్ట్ హౌస్కు తీసుకెళ్లారు. అనంతరం ఐజి రవి ప్రకాష్ నేతృత్వంలోని సిట్ బృందం ఆయనను విచారించింది. కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్ఐల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఫోరెన్సిక్ బృందంతో పరిశీలన చేపట్టారు. కృష్ణలంక స్వర్గపురి స్మశానవాటికలో దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తికి చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సాయికృష్ణ కేసుతోపాటు క్రాంతి కుమార్ అనే యువకుడు సిఐ నాగరాజు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా అధికారులు దృష్టి సారించి విచారిస్తున్నారు. సిట్ బృందం ఇంతకుముందే సాయికృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ఇప్పటికే విచారించారు. ఈ కేసు విచారణలో ఎడిసిపి లతా కుమారి తన వాంగ్మూలంలో సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన మాట వాస్తవమేనని, అయితే విచారణ తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పగించామని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని సిట్ ఎదుట చెప్పినట్లు తెలిసింది.








కామెంట్లు (0)