ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : రైతు జీవనానికి ఆశల పండుగ, సరికొత్త సాగు ఉత్సాహానికి ప్రతీక అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలు అమలాపురం మండలం సమనస గ్రామంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు,జిల్లా కలెక్టర్ మహేష్ రవిరాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.నూతన వ్యవసాయ సంవత్సరాన్ని పురస్కరించుకుని గ్రామంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలలో ఎమ్యెల్యే ఆనందరావు, కలెక్టర్ మహేష్ రవిరాల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతూ, ఎమ్యెల్యే స్వయంగా ఎడ్లను నడుపుతూ దుక్కి దున్నారు (నాగలి పట్టారు).ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక. కష్టాన్ని నమ్ముకున్న అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఆశయం. భూమాతను పూజించి, నాగలి పట్టి కొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టే ఈ పవిత్ర పర్వదినాన నియోజకవర్గ మరియు రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పాడిపంటలు కళకళలాడాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రతి రైతు ఇల్లు సిరిసంపదలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సమనస గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)