హైదరాబాద్ : సమంత, రాజ్లకు చిరంజీవి దంపతులు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు. టీం ను ఇంటికి పిలిచి సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత దంపతులకు నూతన వస్త్రాలను బహుమతిగా అందించారు. కాసేపు ఆ జంటతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ ఫొటోలను పంచుకున్న సామ్.. చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపించిన ఆదరణ, మద్దతుకు ధన్యవాదాలు. మీ ప్రశంసలకు మా చిత్ర బృందం ఎంతో సంతోషిస్తోంది’’ అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ‘మెగా బంగారం మూమెంట్’ అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొందరు మాత్రం సమంత తల్లి కానున్న నేపథ్యంలో చిరంజీవి దంపతులు సారె పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలంటూ చిరంజీవి ఈ ఫొటోలు పంచుకున్నారు. ‘‘మా ఇంటి బంగారం’’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం’ అని చిత్రబృందాన్ని అభినందించారు. సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీ పిక్చర్స్’పై తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సమంత ఈ పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాతో మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతున్న వేళ మెగాస్టార్ నుంచి ప్రశంసలు రావడం చిత్రయూనిట్లో జోష్ నింపింది. మరోవైపు మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.43 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.









కామెంట్లు (0)