న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చేపడుతున్న సర్ (ఎస్ఐఆర్), ఎన్నికల కమిషనర్ సహా ఇతర ఎన్నికల సంబంధిత సమస్యలపై ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కి లేఖరాశాయి. ఇండియా బ్లాక్లోని 23 ప్రతిపక్షపార్టీలతో పాటు స్వతంత్ర ఎంపి సంయుక్తంగా మంగళవారం సిజెఐకి లేఖను పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు పశ్చిమబెంగాల్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో చేపడుతున్న సర్పై ఆందోళన వ్యక్తం చేశారు. జైరాం రమేష్ ఈ వివరాలను తెలియజేస్తూ.. ప్రతిపక్షాలు ‘‘ఎస్యుఆర్ఇ - సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన’’ అనే సూత్రానికి ధృడంగా కట్టుబడి ఉన్నాయని అన్నారు. 23 ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలతో పాటు స్వతంత్ర ఎంపి కపిల్ సిబాల్ ఈ లేఖపై సంతకాలు చేశారని అన్నారు. జూన్ 8న జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో సిజెఐకి సంయుక్తంగా లేఖ రాయాలని 21 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ లేఖపై డిఎంకె, ఆప్ పార్టీలు కూడా సంతకాలు చేశాయని టిఎంసి నేత డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఆప్, డిఎంకెలు తిరిగి ఇండియా బ్లాక్లో చేరడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ప్రాతపై లేఖలో విస్త్రృతంగా చర్చించారని అన్నారు.
'ఇండియా బ్లాక్’ ఆ లేఖలోని వివరాలను వెల్లడించలేదు. అయితే "అన్ని విధాల విఫలమైనప్పుడు, భారత ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థ వైపు చూస్తుంది. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని, అలాగే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే విధానాలను మేము ఎత్తిచూపాము’’ అని సీనియర్ నేత ఒకరు తెలిపారు.








కామెంట్లు (0)