వచ్చే ఏడాది 2 లక్షల మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి రావాలి
షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యాశాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ విద్యార్థుల కోణంలో ఆలోచించి తీసుకున్నామని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులను సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకొని పని చేశామని, వన్ క్లాస్ వన్ టీచర్ గేమ్ ఛేంజర్గా తీసుకున్నామని తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో పాఠశాల విద్యాశాఖ సత్కరించింది. తాడేపల్లిలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి తనకు రెండేళ్ళు పట్టిందని చెప్పారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు పెడుతోందని, ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని సూచించారు. తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడి చదివిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని కోరారు. చదువుకున్న పాఠశాలను మర్చిపోవద్దని, అవకాశం ఉన్నప్పుడు తమవంతు సహాయం పాఠశాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో దేశం మొత్తం ఎపి మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుకోవాలనదే తన కోరిక అని చెప్పారు. వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు తయారుకావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఇంకా పెరగాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. కడప కలెక్టర్ ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్ తెచ్చామని, త్వరలో రాష్ట్రం మొత్తం సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. షైనింగ్ స్టార్స్ విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉందన్నారు. కష్టపడి చదవితే వారి కలలను నెరవేర్చే బాధ్యత తనదేనన్నారు. అనంతరం విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ తమీమ్ అన్సారీయా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్, బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులురెడ్డి, ఇంటర్మీడియట్ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి ఎ సైమన్ విక్జర్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)