3, 4, 5 తేదీల్లో రైతుసంఘం రాష్ట్ర మహాసభ
ప్రచార జాతా ప్రారంభ సభలో నేత వై కేశవరావు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : రైతు ఉద్యమాల రథసారథి ఎపి రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభ జులై 3, 4, 5 తేదీల్లో జరగనుందని, ఈ సందర్భంగా ‘3న హలో రైతన్న చలో ఏలూరు’ కార్యక్రమంలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రచార జాతాను జెండా ఊపి ప్రారంభించారు. తొలుత పవర్ పేట ఉద్దరాజు రామం భవనం నుండి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన జాతా ప్రారంభ సభలో కేశవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అనేక రైతాంగ ఉద్యమాలను నిర్వహించిందని గుర్తు చేశారు. 1936-37 కాలంలో కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, చలసాని వాసుదేవరావు నాయకత్వంలో చారిత్రాత్మక రైతు రక్షణ యాత్ర జరిగిందని, ఫలితంగా అనేక రైతాంగ సమస్యలు పరిష్కారమయ్యాయని వివరించారు. నేడు వ్యవసాయం రంగాన్ని కార్పొరేటీకరణ చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ఇవి రైతాంగానికి తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, తక్షణమే మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ నేడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజారామ్మోహన్ రాయ్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం.నాగమణి, ప్రజానాట్యమండలి, ఎపి రైతు సంఘం, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతా భీమడోలు, ఉంగుటూరు మండలాల మీదుగా నిడమర్రు చేరుకుంది.









కామెంట్లు (0)