ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వంలో రాయలసీమ ‘‘రతనాల సీమ’’గా మారుతుందని రోడ్లు, భవనాల శాఖమంత్రి బిసి జనార్థన్ రెడ్డి అన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమను కరువులు, వలసలకు నిలయంగా కాకుండా పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యానవన అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 24 నెలల్లో సుమారు 240 పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల ద్వారా రూ.5.33 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమకూరాయని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు రాయలసీమ ప్రాంతానికే దక్కుతోందని వివరించారు.
ఈ పెట్టుబడుల ఫలితంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో సుమారు 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమకు శంకుస్థాపన జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరో సమావేశంలో అన్నారు. జూలై 3వ తేది కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగబోతుందని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేశామని, చంద్రబాబు ఆ క్రెడిట్ను దొంగిలిస్తున్నట్లు వైసిపి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని టిడిపి అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ మనుగడ లేకుండా పోతుందనే భయంతోనే జగన్ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.









కామెంట్లు (0)