ఎల్నినో దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
లాంలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ర్టంలో ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభ సూచికగా ఏటా నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమవారం ఆయన ప్రారంభించారు. అరక దున్నారు. ఎద్దులకు పూజ చేశారు. పొలంలో ట్రాక్టరు నడిపి దమ్ము చేసే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 రోజుల్లో యాప్ ద్వారా 15,47,951 బస్తాల ఎరువులు పంపిణీ చేశామని, యాప్ ద్వారా లబ్ధి పొందిన వారిలో మూడు లక్షల మందికిపైగా కౌలు రైతులు కూడా ఉన్నారని వివరించారు. ఎరువులను శాస్త్రవేత్తల సూచనల మేరకు అవసరమైనంతే పంపిణీ చేస్తున్నామన్నారు. మిర్చి పంటలో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చైనా వారు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్రిమిసంహారక మందులు అధికంగా వాడవద్దని సూచించారు. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల దృష్ట్యా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ సమతుల్యంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. ఉద్యాన పంటలకు మంచి డిమాండ్ ఉందని, రైతులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. వర్జీనియా పొగాకు ధరలపై టోబాకో బోర్డు, వ్యాపారులతో చర్చించామని, కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దని స్పష్టం చేశామని తెలిపారు.









కామెంట్లు (0)