సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ధైర్యం ఉంటే శాసనసభకు రండి : సిఎం చంద్రబాబు సవాల్

1 గంట క్రితం

Come to the Legislative Assembly if you have the courage: CM Chandrababu's challenge.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 03:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : వైసిపి ఎమ్మెల్యేలకు ధైర్యముంటే డిఎస్సి పై చర్చించేందుకు శాసనసభకు రావాలని సిఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. సోమవారం జరిగిన శాసన సభలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ .... మెగా డిఎస్సి కి సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వంపై కుట్రలు పన్నేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వైసిపి ఎమ్మెల్యేలకు ధైర్యముంటే దీనిపై చర్చించేందుకు శాసనసభకు రావాలని సవాల్‌ విసిరారు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు. విద్యను టిడిపి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. గురుకుల పాఠశాలల విధానాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు వచ్చాయన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కూడా సరిగా ఉండేవి కాదు అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలతోపాటు మండలానికి ఒక కళాశాల, డివిజన్‌కు ఒక ఇంజినీరింగ్‌ కళాశాల, జిల్లాలకు వైద్య కళాశాల ఏర్పాటు విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. 1995 నుంచి 2025 వరకు 14 డీఎస్సీ ల్లో 11 తానే నిర్వహించానన్నారు. పాఠశాలల్లో 80 శాతం తన హయాంలో నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన టీచర్లే ఉన్నారనీ, ఒక్కరు కూడా ఎప్పుడూ అవినీతి జరిగిందని చెప్పిన సందర్భమే లేదు అని చెప్పారు. ఇప్పుడు మెగా డిఎస్సి పై వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే విశ్వసనీయతను దెబ్బతీయాలంటే వారి తరం కాదన్నారు.. ఖబడ్దార్‌. తాము ఏదీ దాచిపెట్టలేదు అని హెచ్చరించారు. ఆన్సర్‌ కీ, మెరిట్‌ లిస్ట్‌, సెలక్షన్‌ లిస్ట్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ధైర్యం ఉంటే శాసనసభకు రావాలని సవాల్ విసురుతున్నానన్నారు. ఇది పవిత్రమైన వేదిక అని.. ఇక్కడ అడిగితే తాము సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. వైసిపి హిట్‌ అండ్‌ రన్‌ పార్టీ.. అని ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు అని ఎద్దేవా చేశారు. డిఎస్సి అభ్యర్థులకు వారి కష్టంతో ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఉద్యోగాలు వచ్చిన టీచర్లు ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుట్రలను ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. తాను ఈ సీటులో కూర్చున్నంత వరకు ఎవరైనా తప్పు చేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్